హుజూర్నగర్లో
ప్రతిపక్ష నేత పోస్ట్ ఖాళీ..
హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రతిపక్షానికి నేతలే కరువయ్యారు.
వరుస విజయాలతో ప్రస్తుత మంత్రివర్గంలో ప్రముఖ మంత్రిగా కొనసాగుతున్న నలమాద ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గo కావడం గతంలో బిఆర్ఎస్ నుండి పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి పరాజయం చెందడం వెనువెంటనే జాతీయ బిజెపి పార్టీలో చేరి పార్లమెంటుకు పోటీ చేయడం తో ఇక నియోజకవర్గానికి ప్రతిపక్ష నాయకుడే లేని విధంగా తయారైంది.
ఒకప్పుడు కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్న హుజూర్నగర్ కాలక్రమేనా కమ్యూనిస్టుల ప్రాబల్యం అంతరించి పోతుండగా నియోజకవర్గ స్థాయి నాయకుల ప్రాముఖ్యత తగ్గిపోవడం తో ఆంధ్ర పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం నాయకులు సైతం వివిధ పార్టీలకు వెళ్లిపోవడం తో 2014 నుండి నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన నాలుగు సంవత్సరాల్లోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకొని పరాజయం పొంది నియోజకవర్గంలో తిరిగి కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిన శానంపూడి సైదిరెడ్డి పార్టీ మారగానే బిఆర్ఎస్ ఇంచార్జిగా హుజూర్నగర్ కు సంబంధంలేని. మాజీ మంత్రికి దగ్గరైన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకుడు నరసింహారెడ్డిని నియమించినప్పటికీ మొక్కుబడి కార్యక్రమాలు తప్ప అంతగా ప్రభావం చూపకపోవడంతో హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుడి స్థానం కాళీ ఏర్పడింది.
బిజెపి పార్టీ నుండి గతంలో పోటీ చేసిన శ్రీలత రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పటికీ పార్టీకి అంతగా ప్రభావం లేకపోవడం తో ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వెళ్లలేక పోతోంది. దీంతో హుజూర్నగర్ నియోజకవర్గం ప్రతిపక్ష నాయకుడు లేని నియోజకవర్గంగా ముద్ర పడిపోయింది. ఇప్పటికిప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీదారుడే లేడన్న విధంగా హుజూర్నగర్ ఉంది.
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ప్రతిపక్ష నాయకుడు లేని నియోజకవర్గంగా హుజూర్నగర్ ఉందనే అభిప్రాయంలో రాజకీయ విశ్లేషకులు ఉన్నారంటే పరిస్థితి ఇట్టే అర్థమవుతుంది.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీసి ప్రజల పక్షాన నిలబడి అధికార పక్షానికి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను గుర్తు చేస్తూ ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చే ప్రధాన ప్రతిపక్షం లేని రోజున ఏకపక్ష నిర్ణయాలతో అధికారపక్షం రాజ్యమేలితే ప్రజలకు పూర్తిస్థాయి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదు.
ఇప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలు హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షల మేరకు సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్రను పోషించే నాయకులను నియమించి ప్రజల పక్షాన నిలబడాలని ప్రజలు కోరుతున్నారు.