కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై ప్రతిపక్షాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివా్సరెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కోదండరామ్, ప్రొఫెసర్ హరగోపాల్, పర్యావరణవేత్త నర్సింహారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాదానికి కారణమైన భూమిపై కూలంకషంగా చర్చ జరిగింది. అటు ప్రభుత్వం, ఇటు హెచ్సీయూ అధికారులు భూమికి సంబంధించి తమ వద్ద ఉన్న రికార్డులు, పత్రాల ఆధారంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆ భూమిపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని ప్రభుత్వం వాదనలు వినిపించింది. అక్కడ అభివృద్ధి పనులు చేపడితే ఉద్యోగ కల్పనకు పెద్దఎత్తున అవకాశాలు ఉంటాయని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు, అడవి అనగల అన్ని అర్హతలు ఆ ప్రాంతానికి ఉన్నాయని, ప్రస్తుతం ఉన్నట్లుగానే ఆ స్థలాన్ని ఉండనివ్వాలని హెచ్సీయూ అధికారులు, పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. అయితే, భూమిపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేసిన ప్రభుత్వం.. తమ అభీష్టం మేరకే ముందుకు వెళతామన్న విషయమై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం వెలువర్చలేదు. అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుని తదుపరి అడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఈ భూమికి సంబంధించి ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టనుంది.