ఢిల్లీ కేకే మీడియా డిసెంబర్ 26
ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం. రాష్ట్రానికి కేంద్ర సహకారం కోసం ప్రధాని మోదీని కలిశామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
సమాఖ్య స్ఫూర్తిలో భాగంగానే ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశామని ఈ సందర్భంగా చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో *ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీకి సంబంధించిన విషయాలను సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.*
నీళ్లు, నిధులు, నియామకాలు కోసమే కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కులను సాధించటంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. *బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు గురించి ప్రధానితో చర్చించామని* ఈ సందర్భంగా వెల్లడించారు. *కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని* కోరామన్నారు. విభజన చట్ట ప్రకారం *ఒక మేజర్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని* అడిగామన్నారు. *పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని* కోరామని తెలిపారు. పెండింగ్లో ఉన్న *ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేయాలని* కోరామని వివరించారు. *తెలంగాణకు ఒక ఐఐఎం, సైనిక స్కూల్ మంజూరు చేయాలని* అడిగామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.