అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ( ఐ ఎస్ ఎస్ ) చిక్కుకున్న భారతీయ మూలాల అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బచ్ విల్మోర్ త్వరలో భూమికి తిరిగి రానున్నారు. వీరిని తీసుకురావడానికి స్పేస్ఎక్స్ రూపొందించిన ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 4:30 గంటలకు ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా నలుగురు కొత్త వ్యోమగాములు ఐఎస్ఎస్ చేరుకోనున్నారు. కొత్త సిబ్బంది అంతరిక్ష కేంద్రంలో చేరిన అనంతరం సునీతా, విల్మోర్ భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు.
2024 జూన్ 5న బోయింగ్ స్టార్లైనర్ ద్వారా ఐ ఎస్ ఎస్ కి వెళ్లిన సునీతా, అనివార్య సాంకేతిక సమస్యల కారణంగా భూమికి తిరిగి రాలేకపోయారు. స్టార్లైనర్లో హెలియం లీకేజీ, ఇతర సమస్యలు తలెత్తడంతో వారి తిరుగు ప్రయాణం అనేకసార్లు వాయిదా పడింది. సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించేందుకు నాసా, స్పేస్ఎక్స్ సంస్థలు కలిసి క్రూ-10 మిషన్ను ప్రారంభించాయి.
ఇప్పటివరకు 322 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీతా, గతంలో స్పేస్వాక్ చేసిన తొలి భారతీయ సంతతి మహిళగా రికార్డు సృష్టించారు. గత 9 నెలలుగా ఐ ఎస్ ఎస్ లో ఉన్న ఆమె, తాజా మిషన్ విజయవంతంగా పూర్తికావడంతో మరికొద్ది రోజుల్లో భూమికి చేరుకోనున్నారు.