నేరేడుచర్ల, కేకే మీడియా
మండలంలోని జగన్నాథ్ తండాలో డ్రైనేజీ నీళ్లు బయటకెళ్ళిపోకుండా అడ్డుకట్టలు వేయడంతో రోడ్డుపై మురికి నీళ్లు నిలిచి ఇబ్బందికరంగా ఉందని తండావాసులు రమావత్ సైదా, రమావత్ రవీందర్, శ్రీరాములు, వాలియా, బాలు శివ తదితరులు తెలిపారు. గతంలో డ్రైనేజీ మురికి నీళ్లు వరి పొలాలకు వెళ్ళటంతో ఇబ్బంది లేకుండా ఉండేదన్నారు. ప్రస్తుతం రైతులు తమ పొలాలలోనికి డ్రైనేజీ మురికి నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేయటంతో ఇండ్ల ముందు సీసీ రోడ్డుపై మురికి నీళ్లు నిలువ ఉండి దుర్గంధం వస్తుందన్నారు. డ్రైనేజీ కాలువ నుండి మంచినీటి పైపులు వెళ్తున్నాయని, అవి పగిలి వాటిలోకి డ్రైనేజీ నీళ్లు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. డ్రైనేజీ మురికి నీళ్లు తాగునీటి పైపుల్లో కలుస్తే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని విచారం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు డ్రైనేజీ కాలువను తీసి మురికి నీళ్లు లేకుండా చూడాలని కోరారు.
*పంచాయతీ కార్యదర్శి వివరణ:* ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా డ్రైనేజీ కాల్వ చివరి వరకు మంజూరు అయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. గతంలో డ్రైనేజీ మురికి నీళ్లు వరి పొలాలకు వెళుతుంటే అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు డ్రైనేజీ నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఎంపీడీవోకు తెలియపరచి,రైతులకు నచ్చ చెప్పిన వినటం లేదన్నారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు.