ఏమాత్రం తగ్గేదేలే.. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం.. 104 శాతానికి చేరిన సుంకాలు
అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించారు.
ట్రంప్ ఏమాత్రం తగ్గట్లేదు. సుంకాల విషయంలో తన వైఖరిని మార్చుకునేదే లేదంటున్నారు. చైనాపై మరో 50శాతం ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు. దీంతో అమెరికా , చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. ముందుగా చెప్పినట్లుగా అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు.
తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104 శాతానికి చేరాయి. ఇవి ఏప్రిల్ 9 అంటే ఈరోజు నుంచి అమలులోకి రానున్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు.
అయితే.. ట్రంప్ నిర్ణయంపై చైనా ఇంకా స్పందించలేదు. పలు దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తూ తమ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయని ట్రంప్ పలు సార్లు ఆరోపించారు.
ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో.. ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది.