కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వద్ద ప్రస్తుతం నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకొన్నాయి
ఐపీఎల్ మహా సంగ్రామానికి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఇక తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ తలపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు టాస్, 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ జరగనున్న కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వద్ద ప్రస్తుతం నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకొన్నాయి. అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతున్నాయి. మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. గురువారం నుంచి ఆదివారం వరకు దక్షిణ బెంగాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఐఎండీ ఈరోజు (మార్చి 22న) ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, ఆదివారం నాడు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అటు ప్రారంభ వేడుకలు సైతం వర్షం కారణంగా రద్దు కానున్నట్లు తెలుస్తోంది.