మోదీ, షా సపోర్ట్ – రామ్మోహన్పై ఎన్ని కుట్రలు చేస్తే అంత బలోపేతం !
కేంద్ర మంత్రి వర్గంలో అత్యంత పిన్నవయస్కుడైన మంత్రి రామ్మోహన్ నాయుడును ఆయన తప్పు లేకపోయినా టార్గెట్ చేసుకుంటున్న విపక్షాల తీరుతో ఆయన మరింత బలోపేతం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ లో విపక్షాలు ఇండిగో సంక్షోభంపై రచ్చ చేసే ప్రయత్నం చేశాయి. కానీ రామ్మోహన్ నాయుడు ఒంటి చేత్తో సమర్థంగా ఎదుర్కొన్నారు. ఆయన ఇచ్చిన సమాధానానికి.. ఇతర పార్టీలు కూడా వంకలు పెట్టలేకపోయాయి. ఈ సమాధానం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షాలను మెప్పించింది. వారు స్వయంగా రామ్మోహన్ నాయుడుకు ఫోన్ చేసి సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు.
సంక్షోభం బయటపడగానే వేగంగా స్పందించిన రామ్మోహన్ నాయుడు
ఇండిగో వ్యవహారం దారి తప్పుతోందని తన మంత్రిత్వ శాఖకు తెలిసిన వెంటనే రామ్మోహన్ నాయుడు వెంటనే చర్యలు చేపట్టారు. ఫిర్యాదులు పెరుగుతున్న సమయంలోనే.. తన కార్యాలయంలో వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కానీ ఇండిగో అసలు నిజాలను దాచిపెట్టింది. పరిస్థితి చేయి దాటి పోయే వరకూ బయటపడలేదు.ఈ కారణంగా ఐదు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అయితే రామ్మోహన్ నాయుడు వేగంగా స్పందించారు రీఫండ్ ను గంటల్లోనే ఇప్పించడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నించారు. పైలట్ల విషయంలో కొన్ని నిబంధనలు సడలించారు. అలాగే ఇతర సంస్థలు అదనపు సర్వీసులు నడిపేలా చేశారు. ఓ పెద్ద సంక్షోభాన్ని పూర్తిగా అధిగమించ లేకపోవచ్చు కానీ.. వీలైనంత వరకూ ఆయన సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు.
ఏకపక్షంగా రామ్మోహన్ పై దాడికి విపక్షం ప్రయత్నం
అక్కడ సమస్య ఏమిటో చాలా స్ఫష్టంగా అందరికీ తెలుసు. మంత్రిత్వ శాఖ పరిధిలో లేని ..ప్రైవేటు సంస్థ స్టాఫింగ్ వ్యవహారంతో సమస్య వచ్చింది. మిగతా ఏ ఎయిర్ లైన్స్ కు లేని సమస్య ఆ సంస్థకు వచ్చింది. అది పూర్తిగా స్వయం తప్పిదం. పైలట్ల నియామకం విషయంలో డీజీసీఏను కూడా తప్పుదోవ పట్టించారు. ఈ సమస్యకు..సంక్షోభానికి రామ్మోహన్ నాయుడు పనితీరుకు అసలు లింకే లేదు. అయినా మోదీ ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందో అని ఎదురు చూస్తున్న వారికి ఈ ఇండిగో సంక్షోభం దొరికింది. అంతే రాళ్లందుకున్నారు.
విపక్షాలను ఎదుర్కోవడంలోనూ సమర్థత చూపిన రామ్మోహన్ నాయుడు
తన తప్పు లేకపోయినా.. తమ మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యం లేకపోయినా తనపై జరుగుతున్న ముప్పేట దాడిని రామ్మోహన్ నాయుడు సమర్థంగా ఎదుర్కొన్నారు. పార్లమెంట్ లోనే ఆయన ఇచ్చిన సమాధానానికి విపక్షాలు తప్పు పట్టలేకపోయాయి. అసలు రామ్మోహన్ నాయుడు చేసిన తప్పేమిటి.. విమానయాన మంత్రిత్వ శాఖ చేసిన తప్పేమిటో మాత్రం ఎవరూ చెప్పలేదు. ప్రయాణికుల భద్రత కోసం పైలట్ల విశ్రాంతి సమయం పెంచడమే సమస్య అయితే… ఇతర ఎయిర్ లైన్స్ కు రాని సమస్య ఇండిగోకు ఎందుకు వస్తుంది?.ఈ ప్రశ్నకూ విపక్షాల వద్ద సమాధానం లేదు. రామ్మోహన్ నాయుడుకు ఎంతో భవిష్యత్ ఉంది. ఇలాంటి సవాళ్లు ఆయన సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

