*శ్రీమంతులే కాదు.. పేదలు సన్నబియ్యం తినాలి..*
*తనకు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నందికి పందికి ఉన్నంత తేడా…!!*
*-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
*హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ పధకాన్ని ప్రారంభించిన సియం రేవంత్ రెడ్డి…*
శ్రీమంతులు తినే సన్న బియ్యం.. ఇకపై పేదలూ తింటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అర్హులందరికీ తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. రేషన్ కార్డులోని సభ్యులు ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. *సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్లో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.* అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది పండగ రోజు ఈ పథకం ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందన్నారు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకే ఈ సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. *పండగలకే కాదు.. ప్రతిరోజూ పేదలకు తెల్ల అన్నం తినాలని* ఆయన ఆకాంక్షించారు. పేదలకు ఆహార భద్రత కోసమే ప్రజాపంపిణీ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. *పీడీఎస్ను 70 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ అమలు చేసిందని..* దీనిని నాటి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కొనసాగించారని గుర్తు చేశారు. అయితే *దొడ్డు బియ్యం ఇస్తే చాలా మంది అమ్ముకుంటున్నారని* ఆగ్రహం వ్యక్తం చేశారు. *పేదలు దొడ్డు బియ్యం తినడం లేదని.. మిల్లర్ల మాఫియాలోకి వెళ్తోందని* విమర్శించారు. *దొడ్డు బియ్యంతో ఏటా రూ.10 వేల కోట్ల దోపిడీ చేస్తున్నారని* సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
ఈ సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. *చరిత్రలో ఎవరు సీఎం అయినా ఈ పథకం కొనసాగించాల్సిందేనని* స్పష్టం చేశారు ఇది తెలంగాణ ప్రజల అదృష్ణమని ఆయన అభివర్ణించారు. నల్గొండ రైతాంగాన్ని ఆదుకోవడానికి నెహ్రూ కాలం నుంచి.. నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ప్రతిష్టాత్మక *ఎస్ఎల్బీసీ టన్నెల్ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని* మండిపడ్డారు. *ఏడాదికి కిలోమీటర్ తవ్వినా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయ్యేదని* ఆయన చెప్పారు. *కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం* అని ఆయన ఎద్దేవా చేశారు. *కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలిపోయిందని* సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. *శకునం చెప్పే బల్లి.. కుడితిలో పడి చచ్చినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి ఉందని* ఆయన విమర్శించారు. *సన్న బియ్యం ఎలా ఇస్తారని వారు శాపనార్థాలు* పెడుతున్నారన్నారు. కానీ తమ సంకల్పబలం చాలా గొప్పదని ఆయన పేర్కొన్నారు. అర్హులైన అందరికి ఈ సన్నబియ్యం పథకాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే *రైతు రుణ మాఫీ కూడా చేశాం…* అన్నారు.
*తనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నందికి పందికి ఉన్నంత తేడా* ఉందన్నారు. అయినా.. *బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తనతో పోల్చుకోవడం ఏమిటని* సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు..